జనాలను లాఠీలతో కొట్టిన పోలీసు సిబ్బంది.. హైదరాబాద్ సీపీ అసహనం

లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అనవసరంగా రోడ్లపైకి వస్తూ... లాక్ డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. రోడ్ల మీదకు రాకుండా, ఇంటి పట్టునే ఉండాలంటూ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారిపై కొన్ని సందర్భాల్లో పోలీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మీర్ చౌక్ పీఎస్ పరిధిలో కొందరు వ్యక్తులను ఓ కానిస్టేబుల్, గోల్కొండ పరిధిలో ఓ హోంగార్డు లాఠీలతో కొట్టారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు కింద స్థాయి పోలీసు సిబ్బంది వల్ల డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు వస్తోందని అన్నారు. వీరికి ఏసీపీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు. ప్రతి డీసీపీ ప్రతి రోజు తన జోన్ లో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లను సందర్శించాలని అన్నారు. రంజాన్ ఉపవాసాలను పాటిస్తున్న వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

Police
Hyderabad Police
Commissioner

More Telugu News